ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 10, 2017, 07:22 PM

అహ్మదాబాద్ తరహాలోనే హైదరాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించాలని యునెస్కోను కోరామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు. యునెస్కో గుర్తింపు పెద్ద ప్రక్రియ అని.. ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని కేటీఆర్ అన్నారు. సోమవారం (జులై 10) ఆయన కుతుబ్‌ షాహీ టూంబ్స్‌లో దక్కన్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అవరోధాలన్నింటినీ అధిగమించి దక్కన్ పార్కును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పార్క్‌లో వాకర్స్‌కు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. హరితహారంలో భాగంగా దక్కన్ పార్కును అభివృద్ధి చేయాలని అధికారులకు ఆయన సూచించారు.


హైదరాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. నగరానికి ఏటా పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోందని, హైదరాబాద్‌ను టూరిస్ట్ ఫ్రెండ్లీ నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ను సురక్షిత, స్మార్ట్ నగరంగా, అత్యంత అనుకూల ప్రాంతంగా తయారు చేయాలనేదే మా తాపత్రయం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa