ఆకుపచ్చ తెలంగాణ కోసం చేపట్టిన మూడో విడత హరితహారం విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ బృహత్ కార్యంలో భాగస్వాములు అవుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పెద్దకోడూరులో మహిళా పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగంణంలో విద్యార్ధులతో కలిసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలిస్తోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు అన్నారు. అటు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో టీ న్యూస్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బాబు మోహన్ స్థానికులతో కలిసి మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని హోం మంత్రి నాయిని పిలుపునిచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్ అంజుమన్ హై స్కూల్లో నాయిని హరితహారంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అటు వికారాబాద్ జిల్లా తాండూరులో హరితహారంలో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక చెరువు కట్టపై ఈత మొక్కలు నాటారు. అటు పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు.