సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 150 పడకల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అయన అన్నారు. అన్ని జిల్లాల ఆస్పత్రులలో ఐసీయూలు ఏర్పాటు చేశామని అయన అన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ కిట్లు గర్భిణీలకు శ్రీరామరక్ష అని ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగుపరిచామని అయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78 శాతం నార్మల్ డెలివరీలు చేస్తున్నారని అయన అన్నారు. డెలివరీలు 46 నుంచి 66 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రులను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, వైద్యశాలల దిశాదశ మారిపోయిందని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో 60 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభించామని, త్వరలోనే సంగారెడ్డిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోబోతున్నామని అయన అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 400 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అన్నారు. సంగారెడ్డి ఆస్పత్రికి కార్డియాలజీ, యూరాలజీ విభాగాలు మంజూరు చేశామని హరీష్రావు అన్నారు. వచ్చే మూడు నెలల్లో పూర్తిస్థాయిలో విభాగాలు పని చేస్తాయని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు ఆస్పత్రుల స్థాయిలో వైద్యం అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ సెంటర్లు ఏర్పాటు చేశామని, దేశంలో ఎక్కడా ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు లేవని మంత్రి వ్యాఖ్యానించారు. కానీ ఒక్క తెలంగాణలోనే సీఎం కేసీఆర్ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామని హరీష్రావు అన్నారు.