ప్రొ కబడ్డీ ఐదో సీజన్ను తెలుగు టైటాన్స్ జట్టు తనదైన స్టయిల్లో ఘనంగా ఆరంభించింది. హైదరాబాద్లో తమిళ్ తలైవాస్తో జరిగిన ప్రారంభ మ్యాచ్లో 32-27తో విజయం సాధించింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి పది పాయింట్లతో సత్తా చాటడంతో ఈ మ్యాచ్లో టైటాన్స్ జట్టు సునాయాసంగా గెలుపొందింది. రాహుల్కు ఇది 25వ సూపర్ టెన్ రెైడ్ కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే టైటాన్స్ ఆధిక్యంలో కొనసాగింది. తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 17-11తో దూసుకెళ్లింది. మలి అర్ధభాగంలో తెలుగు జట్టు చేసిన కొన్ని పొరబాట్ల వల్ల తలైవాస్ పుంజుకుంది. చివర్లో ఆ జట్టు పోరాడినప్పటికీ.. పాయింట్ల అంతరం ఎక్కువగా ఉండటంతో ఓటమి తప్పలేదు.
తెలుగు టైటాన్స్ జట్టుకు రాహుల్ చౌదరి కెప్టెన్గా వ్యవహరించగా.. తమిళ్ జట్టుకు అజయ్ థాకూర్ నాయకత్వం వహించాడు. టైటాన్స్ జట్టు గత సీజన్లో నాలుగోస్థానంలో నిలువగా.. తమిళ్ తలైవాస్ జట్టు ఈ సీజన్లోనే తొలిసారిగా బరిలో దిగుతోంది.ప్రొ కబడ్డీ ఐదో సీజన్ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన జాతీయ గీతం ఆలపించి సీజన్ను ఆరంభించారు. తమిళ్ తలైవాస్ జట్టు సహ యజమానులు సచిన్, మెగాస్టార్ చిరంజీవి.. ఆరంభ మ్యాచ్కు హాజరై తమ జట్టును ఉత్సాహపరిచారు. అల్లు అరవింద్ ఆయన తనయుడు అల్లు అర్జున్ కూడా తమ జట్టుకు ప్రోత్సాహం అందించారు. ఎప్పటిలాగే తెలుగు టైటాన్స్ జట్టును రానా ఎంకరేజ్ చేశారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఒలింపిక్ పతక విజేత సింధు కూడా ఈ మ్యాచ్కు హాజరయ్యారు.
ప్రొ కబడ్డీ ఐదో సీజన్లో 12 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో జోన్కు ఆరు జట్ల చొప్పున రెండు జోన్లుగా ఇవి పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు ప్లేఆఫ్కు ముందు 22 మ్యాచ్ల్లో తలపడనుంది. 13 వారాలపాటు కబడ్డీ పోటీలు క్రీడాభిమానులకు కనువిందు చేయనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa