ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిథాలీ రాజ్‌కు కేసీఆర్ కోటీరూపాయల భారీ నజరానా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 09:21 AM

మహిళల వన్డే క్రికెట్ పపంచ కప్ టోర్నీలో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో అసమాన ప్రతిభ ప్రదర్శించిన టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మిథాలీకి కోటి రూపాయల నగదు బహుమతి, 600 గజాల నివాస స్థలం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీయిచ్చారు. కోచ్‌ మూర్తికి రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీరాజ్‌ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ శాలువా కప్పి మిథాలీని, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తిని  సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్‌గా తీర్చిదిద్దారంటూ ప్రశంసించారు.


 అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో మన జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. ‘‘ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారు. ఫైనల్ దాకా వచ్చారు. ఫైనల్లో కూడా గెలవడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తు కొద్ది తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడింది. దేశమంతా మీ ఆట చూసింది. నేను కూడా చూశాను. అంతా మీకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా నువ్వు ఈ టోర్నీలో బాగా ఆడావు. అద్భుత ప్రతిభ కనబరిచ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నావు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి నువ్వు గర్వకారణం. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలి. వ్యక్తిగతంగా నా తరుఫున, తెలంగాణ ప్రజల తరుఫున మనసారా అభినందనలు. నీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని మిథాలీతో ముఖ్యమంత్రి అన్నారు.


 ఈ కార్యక్రమంలో మిథాలీరాజ్ తల్లిదండ్రులు లీలారాజ్, దొరై రాజ్, డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ అంజన్ కుమార్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి దినకర్ బాబు, స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న మిథాలీరాజ్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు.


  మిథాలీ తన 18 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఇంత పెద్ద మొత్తం నగదు పురస్కారం పొందడం ఇదే మొదటిసారి. ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరినందుకు గాను బీసీసీఐ జట్టులోని ప్రతి ఒక్కరికీ తలొక 50 లక్షలు ప్రకటించగా, భారతీయ రైల్వే క్రీడా విభాగంలో తాను ఉద్యోగాలిచ్చిన పదిమంది మహిళా క్రికెటర్లకు తలొక 13 లక్షల నగదు పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com