హైదరాబాద్: వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది ఆధారపడిన రంగం చేనేత అని తెలంగాణ మంత్రి కె.తారకరామారావు అన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన చేనేత సంబురాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని.. అందుకే ఈరోజును జాతీయ చేనేత దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని తెలిపారు. చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. బడ్జెట్లో ఆ రంగానికి రూ.1908కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.100కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కాలానికి అనుగుణంగా చేనేత కార్మికులు సరికొత్త డిజైన్లు రూపొందించాలని మంత్రి సూచించారు. ఐటీ ఉద్యోగులంతా వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.