బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరిలను తప్పించడం కోసం మార్గదర్శకాలు ఇవ్వాలంటూ బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 23 తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.
అసలేం జరిగిందంటే..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో సీకే ఖన్నా, అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరిని తప్పించాలని సీఓఏ అభిప్రాయపడింది. బీసీసీఐ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బోర్డు కార్యకాలాపాలు, లోధా కమిటీ సిఫార్సుల అమలుపై సీఓఏ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్డుకు నివేదికలు అందజేస్తోంది. తాజాగా 26 పేజీలతో సీఓఏ ఐదో నివేదిక ఇచ్చింది. లోధా కమిటీ సిఫార్సు అమలులో విఫలమైన అధ్యక్ష కార్యదర్శులు అనురాగ్ ఠాగూర్, అజయ్ షిర్కేలపై ఏ విధంగా వేటు వేశారో.. ఇప్పుడు వీరిపై కూడా వేటు వెయ్యాలని సీఓఏ సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాలన్ని వారు నివేదికలో పొందుపరిచారు. అంతేకాదు జులై 26న బీసీసీఐ సమావేశం నుంచి బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి, పాలక, న్యాయ విభాగం సిబ్బందిని పంపించేయడం వెనుక ఈ ముగ్గురికీ దురుద్దేశాలు ఉన్నాయని సీఓఏ నివేదికలో ప్రస్తావించింది.