-పెళ్లి వ్యవహారమే కారణం!
-వీడిన రాజేష్ హత్య మిస్టరీ
-పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్ సూర్యప్రతినిధి: కరడు గట్టిన నేరస్తుడు గుంటి రాజేశ్ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమ, పెళ్లి వ్యవహారమే రాజేశ్ హత్యకు కారణమని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యాంసుందర్రెడ్డితో పాటు, మరో ముగ్గురు గురువారం ఇబ్రహీంపట్నం ఏసీపీ ఎదుట లొంగిపోయారు. దీంతో మూడు రోజులుగా కొనసాగిన సస్పెన్సకు తెరపడింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ప్రేమ పెళ్లి పేరుతో మోసమే రాజేశ్ హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్థారించినట్లు తెలిసింది. తుర్కయాంజాల్లోని మిత్రా బార్ వద్ద గత సోమవారం రాత్రి గుంటి రాజేశ్ హత్య జరిగింది. బార్లో మద్యం సేవించిన తర్వాత బయటకు వచ్చి కారు ఎక్కుతున్న రాజేశ్ను అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు కత్తులతో పొడిచి చంపారు.
కూతురి మరణంతో రాజేశ్పై కక్ష
సైదాబాద్కు చెందిన మామిడి శ్యాంసుందర్రెడ్డి గుంటి రాజేశ్కు చెందిన ఒక వెంచర్లో ప్లాటు కోనుగోలు చేశాడు. ఈ వ్యవహారంలో శ్యాంసుందర్రెడ్డి తరుచూ రాజేశ్ను కలిసేవాడు. ఈ క్రమంలో శ్యాంసుందర్రెడ్డి కూతురు అనూషారెడ్డితో రాజే్షకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. అయితే అప్పటికే కూతురుకు వేరే సంబంధాలు చూస్తున్న శ్యాంసుందర్రెడ్డి ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పారిపోయిన అనూష రాజేశ్ను పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే రాజేశ్కు రెండు పెళ్లిళ్లు అయిన విషయం తెలుసుకున్న అనూష, తాను మోసపోయానని గ్రహించి పుట్టింటికి తిరిగి వచ్చే సింది. ఆ తర్వాత కొన్ని రోజులకు స్నేహితులతో కలిసి అనూషను గ్రీన్హిల్స కాలనీ నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లిన రాజేశ్ నాగపూర్, ఢిల్లీ, గోవాతో పాటు కేరళకు తీసుకెళ్లాడు. అతడి వల నుంచి తప్పించుకుని వచ్చిన అనూష చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అనూష అనుమానాస్పద స్థితిలో నాగార్జునసాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణానికి రాజేశ్ కారణమనుకున్న శ్యాంసుందర్రెడ్డి అతడిపై కక్ష కట్టి,హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు.
వేగంగా పోలీసుల దర్యాప్తు: కాగా, సోమవారం రాత్రి గుంటి రాజేశ్ హత్య తర్వాత ఆదిభట్ల పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. హత్య జరిగిన సమయంలో మృతుడితో పాటు ఉన్న వ్యక్తులు, వారి సెల్ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు, నిందితులపై స్పష్టత రావడంతో వారిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దించారు. దీంతో మరో దారి లేని నిందితులు లొంగిపోవడానికి సిద్ధమై మీడియాకు లీక్ చేశారు. ఈ క్రమంలో వారు ఔటర్ రింగ్రోడ్పై ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆదిభట్ల సీఐ గోవిందరెడ్డి వారిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సైదాబాద్కు చెందిన మామిడి శ్యాంసుందర్రెడ్డి (48), రాజేంద్రనగర్కు చెందిన షేక్ మహ్మద్ (27), చిత్తూరు జిల్లా మైల్లాచెరువుకు చెందిన పొగారి దయాకర్ (27), అనంతపురం జిల్లా నారప్పగారిపల్లికి చెందిన కుంచపు రమణ (36) ఉన్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa