ఉస్మానియా వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంఎస్సీ విద్యార్ధి మురళి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్కు తరలించారు. మురళి మృతితో వర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మురళి ఆత్మహత్యతో ఓయూ బంద్కు పిలుపునిచ్చారు విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. మురళి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడని, కానీ.. దానిని పోలీసులు మాయం చేసి మరో సూసైడ్ నోట్ను పెట్టారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. పోలీసులు మాత్రం మురళి సరిగా చదవలేక, పీజీ పరీక్షలో ఫెయిలవుతాననే భయంతో చనిపోయాడని సూసైడ్ నోట్ను సృష్టించారని, ఆత్మహత్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
సిద్ధిపేట జిల్లా దౌలాపూర్ గ్రామానికి చెందిన మురళి ఓయూలో ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎంతకీ ప్రభుత్వ ఉద్యోగం రావట్లేదని మనస్తాపం చెంది మానేరు హాస్టల్ బాత్ రూమ్ లో ఉరి వేసుకొని చనిపోయాడు. విద్యార్ధి మృతితో క్యాంపస్ అట్టుడుకుతోంది.