ముంబయి : ముంబయిలోని గోల్డెన్ ట్రైవరీ జాతికి చెందిన బడ్డీ, టైనీ అనే కుక్కలు 5 కోట్ల ట్రస్టుకు వారసులవుతాయి. ఆ వివరాల్లోకి వెళితే, ఆ నగరానికి చెందిన నందిని సచ్దే, నిమేష్ సచ్దే దంపతులకు పిల్లలు లేరు. దీంతో వీరు తిరగని ఆసుపత్రి లేదు, మొక్కని దేవుడు లేడు. ఈ క్రమంలో వారికి ఒక బిడ్డ పుట్టి పురిట్లోనే మరణించి వారిని మరింత బాధలోకి నెట్టేసింది. దీంతో బిడ్డలు లేని బాధను పోగొట్టుకునేందుకు 2003 నవంబర్ 14న నిమేష్ మూడు కుక్కలను తెచ్చారు. అప్పటి నుంచి నందిని, నిమేష్ దంపతులకు ఆ కుక్కలే సర్వస్వం అయిపోయాయి. అప్పటి నుంచి వాటి ఆలన పాలన చూసుకుంటున్న ఆ దంపతులు ఆ కుక్కలనే పిల్లల్లా చూసుకుంటున్నారు. 2016లో ఒక కుక్క మరణించింది. ఈ క్రమంలో నందినికి గుండె సంబంధ సమస్య ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆందోళన చెందిన ఆ దంపతులు తమ తదనంతరం కుక్కలకు ఎలాంటి కష్టమూ రాకుండా తమ ఆస్తిపాస్తులతో కుక్కల సంరక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 5 కోట్ల రూపాయలతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే డబ్బుతో కుక్కల ఆలన పాలన చూసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. కుక్కలకు ఆస్తిపాస్తులా అని ఎవరైనా ప్రశ్నిస్తే `అవి కుక్కలు కాదు, మా పిల్లలు' అని వారిద్దరూ సమాధానమిస్తారు. మనుషుల కంటే జంతువులే చాలా మంచివని వారు చెబుతున్నారు. అవి మాట్లాడలేవు కానీ భావోద్వేగాలు పలికిస్తాయని వారు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa