తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి టీడీపీ నేత మెచ్చా నాగేశ్వరరావు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెచ్చా ఇటీవల టీఆర్ఎస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే తాను టీడీపీని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు.సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని తుమ్మల వ్యవసాయ క్షేత్రంలో ఆయనతో మెచ్చా సమావేశం అయ్యారు. త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరూ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీంతో మెచ్చా మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ గురువని మెచ్చా తెలిపారు. తన ఎదుగుదలకు కారణమైన ఆయన్ను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.