హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల తొలి విడుతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారంతో ముగియనున్నది. బుధవారం సాయంత్రం ఐదు గంటలవరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం నామినేషన్లను పరిశీలించి, బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఉపసంహరణల గడువు ముగిసిన తర్వాత ఈ నెల 13న తుది జాబితాను విడుదల చేస్తారు. అదేరోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్లు దాఖలుచేసిన అభ్యర్థులు ఇప్పటికే ఆయా గ్రామాలు, వార్డుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. గుర్తులు కేటాయించిన తర్వాత ప్రచారం మరింత వేడెక్కనుంది. ఈ నెల 21న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మధ్యలోనే జనవరి 11 నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, 16 నుంచి మూడో విడుత నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది.
తొలి విడుత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకుగాను రెండోరోజైన మంగళవారం 5413 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండ్రోజుల్లో దాఖలైనవి కలుపుకొంటే 8524 నామినేషన్లు వచ్చాయి. ఇక 39,822 వార్డులకుగాను రెండోరోజు 16,946 నామినేషన్లు వచ్చాయి. వార్డులకు రెండ్రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 20,902గా ఉన్నది. మంగళవారం సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ పదవులకు అత్యధికంగా 404 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుసభ్యులుగా సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1874 మంది నామినేషన్లు వేశారు. కనిష్ఠంగా సర్పంచ్ పదవులకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 50 నామినేషన్లు దాఖలుకాగా, వార్డుసభ్యుల పదవులకు కనిష్ఠంగా వనపర్తి జిల్లాలో 141 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం చివరిరోజు కావడంతో జోరుగా నామినేషన్లు దాఖలవుతాయని అంచనావేస్తున్నారు.