రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలపై అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 20న ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాల్లో ఈ నెల 23న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అభ్యంతరాల స్వీకరణను పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు అందుబాటులో ఉండనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు, 23 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జోనల్, డిప్యూటీ కమిషనర్, ఆర్డీవో, తహసీల్దార్, ఏఈఆర్వో, ఈఆర్వో కార్యాలయాల్లోనూ ఓటరు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటు హక్కు దరఖాస్తుల కోసం ప్రధాన మాల్స్ వద్ద డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తామని రజత్ కుమార్ పేర్కొన్నారు. 2015, 2017లో తొలగించిన పేర్లను వెబ్ సైట్ లో పొందుపరుస్తామని రజత్ కుమార్ వెల్లడించారు.