రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలని కోరుకుంటున్న తరుణంలో తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గంలో రాణీ రుద్రమ పోటీకి దిగుతున్నారు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి అనేక ఛానెళ్ళలో కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న రుద్రమ తెలంగాణ ప్రజలకు చిరపరిచితురాలు. స్థానికాంశాలు, సమస్యలపైన మంచి అవగాహన, పట్టు కలిగిన ఆమె.. స్థానిక సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో పని చేయాలని నిర్ణయించుకున్నారు.
రాణీ రుద్రమ తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాలు పంచుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి స్థాపించిన యువ తెలంగాణ పార్టీ ఉపాధ్యక్షురాలిగానే కాక పార్టీ మహిళా విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చట్ట సభల్లో ప్రజాసమస్యలపై పోరాడాలన్న ఆకాంక్షతో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానానికి యువతెలంగాణ అభ్యర్ధిగా రాణీ రుద్రమ పోటీ చేస్తున్నారు. బుధవారం నామినేషన్ కూడా వేశారు. ప్రజాసేవలో తరించాలని కోరుకుంటున్న రుద్రమ పట్టభద్రులైన ఓటర్లు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గెలిస్తే ఒక బాధ్యాయుతమైన ప్రజా ప్రతినిధిగా చట్ట సభల్లో స్థానికాంశాలపై గళమెత్తుతానంటున్నారు రుద్రమ.