ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంషాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 09, 2019, 09:49 PM

వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. 2019లో తాము అధికారంలోకి రాగానే ‘కనీస ఆదాయ హామీ పథకం’ అమలు చేస్తామని ప్రకటించారు. శనివారం (మార్చి 9) సాయంత్రం శంషాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారని, కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. కనీస ఆదాయ హామీ పథకాన్ని ఎలా అమలు చేయనున్నారో రాహుల్ వివరించారు.
అధికారంలోకి రాగానే కనీస ఆదాయాన్ని నిర్ణయిస్తామని రాహుల్ తెలిపారు. ప్రతి పేదవాడికి కనీస ఆదాయం తప్పనిసరిగా అందుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చెప్పే దారిద్య్ర రేఖ లెక్కలకు సంబంధం లేకుంటా కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పరిమితిని నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ ఆదాయ పరిమితికి తక్కుకగా ఉన్న పేదలందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కుల మతాలకు అతీతంగా పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా డబ్బు జమ చేస్తామని రాహుల్ తెలిపారు. ఏ ఒక్క పేదవాడినీ వదిలిపెట్టమని.. పేదవాడు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని ఆదుకుంటామని రాహుల్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా లాంటి కోటీశ్వరుల జేబుల్లోనే డబ్బులేస్తారని ఎద్దేవా చేశారు. కానీ, తాను పేదవాడి కడుపు నింపడానికి డబ్బులిస్తానని తెలిపారు. నీరవ్ మోదీని కూడా పట్టుకొని విచారించి ఆ డబ్బులను పేదవాడికి పంచిపెడతామని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల సందర్భంగా తాను చేసిన వాగ్దానాలు, వాటిని అమలు చేసిన తీరును రాహుల్ వివరించారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పామని.. ప్రభుత్వ ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే చేసి చూపించామని తెలిపారు. దీంతో పాటు వరికి కనీస ధర రూ. 2500గా నిర్ణయించామని వెల్లడించారు. కావాలంటే ఛత్తీస్‌గఢ్ రైతులను అడిగి తెలుసుకోవచ్చని సూచించారు.
రైతులారా భయపడకండి.. ప్రధాని మోదీ గత అయిదేళ్లుగా భారత్‌ను రెండుగా విభజించారని రాహుల్ ఆరోపించారు. అందులో ఒకటి ధనవంతుల భారత్ కాగా.. రెండోది పేదల భారత్ అని తెలిపారు. మెదటి రకం ఇండియాలో నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వారు కోట్ల రూపాలయను కొల్లగొడతారని.. అనిల్ అంబానీ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటారని ధ్వజమెత్తారు.  ఇంకొక భాగమైన భారతదేశంలో పేద రైతులు తమకు రుణమాఫీ చేయమంటూ ప్రార్థిస్తుంటే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అది మా పాలసీ కాదంటారని రాహుల్ విరుచుకుపడ్డారు. ఇలా మోసం చేస్తున్న మోదీని లోక్ సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు సమర్థిస్తారని చురకలు వేశారు. 


కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును అమలు చేస్తామని స్పష్టం చేశారు. ‘మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళందరూ ప్రధాన మోదీ వైపు చూశారు. తమ కోసం ఏం చెబుతారని చూశారు. కానీ, ఆయన నుంచి ఎలాంటి ప్రకటన ఉండదు. యూపీలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మహిళను అత్యాచారం చేస్తే ఎలాంటి చర్యలూ ఉండదు. మోదీ దీనిపై ఏమీ మాట్లాడరు. మోదీ ప్రభుత్వంలో మహిళలు బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు. ‘అధికారంలోకి వస్తే లోక్ సభ, రాజ్యసభ, విధాన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. అత్యాచారాలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని దేశానికి ఓ సందేశం ఇస్తారు. మహిళల వైపు ఎవరైనా కన్నేత్తి చూస్తే ఏం జరుగుతుందో చేసి చూపెడతాం’ అని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com