ముంబయి: ఎన్నికల నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడి లాంటి ఘటన మరొకటి చోటుచేసుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. ‘‘నా వ్యాఖ్యల్ని గుర్తుంచుకోండి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు నెలల్లో పుల్వామా దాడి లాంటి ఘటన మరోసారి చోటుచేసుకుంటుంది. దేశభక్తి పేరిట మిగతా అన్ని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం జరుగుతుంది’’ అని అన్నారు. ముంబయిలో శనివారం జరిగిన పార్టీ 13వ వార్షికోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. వైమానిక దాడిలో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను అమిత్ షా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన ఏమైనా కోపైలట్గా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసమే వైమానిక దాడులు జరిపారని ఆరోపించారు. గతంలో మెరుపు దాడులు సైతం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ముందే నిర్వహించారని వ్యాఖ్యానించారు. రామజన్మభూమి లాంటి అనేక వాగ్ధానాలను నిలబెట్టుకోవడంలో భాజపా విఫలమైందని ఆరోపించారు.