మహబూబాబాద్: టీడీపీలో తనను ఎదగనీయకుండా కుట్ర చేశారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తనపై నమ్మకం ఉంచి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారని.. అందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞుడిగా ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహబాబాబాద్ పార్లమెంట్ స్థానంలో 2 లక్షల పైన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రాబోయే 4 సంవత్సరాల్లో సంవత్సరం పొడవునా చెరువుల్లో నీరు నిండుగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు.