ఆయన తమ అనుచరుడు… తామనే నమ్ముకున్నారని పెద్ద యుద్ధం చేసి మరి పోయిన ఎన్నికల్లో టికెట్ ఇప్పించారు. కాంగ్రెస్ అధిష్టానం సీటు ఇవ్వడానికి నిరాకరిస్తే… మేమూ పోటీ చెసేది లేదని బెదిరించి… భీష్మించి… పట్టుబట్టి సీటు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న సీటును చేజారనివ్వకుండా గెలిపించుకున్నారు. కానీ ఆ గెలిచిన నేతను మాత్రం నిలబెట్టుకోలేక పోయారు. ఇదీ తెలంగాణ కాంగ్రెసులో రెబల్ లీడర్లుగా పేరున్న కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం.
ఆ కోమటిరెడ్డి సోదరులకు నమ్మకంగా ఉండి ఎన్నికల్లో గెలిచిన చిరుమర్తి లింగయ్య కథ. కోమటిరెడ్డి సోదరులకు ఎంతో నమకస్తునిగా పేరున్న లింగయ్య ఇపుడు ప్లేట్ ఫిరాయించారు. కాదుకాదు తన అభిమాన నేతల చేయి వదిలేసి ప్రత్యర్థి కారు ఎక్కేసారు. కాంగ్రెసులో నాయకత్వానికి నిత్య అసమ్మతివాదిగా పేరున్న కోమటిరెడ్డి సోదరులకు ఊహించని షాకిచ్చారుమ్నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. తాను త్వరలోనే టీఆర్ఎ్సలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావుల బాటలోనే లింగయ్య పేరిట శనివారం ఓ లేఖ విడుదలైంది. ఇందులో లింగయ్య కాంగ్రెస్ పార్టీపై ప్రత్యక్షంగా, కోమటిరెడ్డి సోదరులపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంతోనే నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటించారని, టీఆర్ఎస్ కు అఖండ విజయాన్ని చేకూర్చారని పేర్కొన్నారు. ‘‘పెద్ద నాయకులమని చెప్పుకొనే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు.. పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవులు పోషించారు.
అయినప్పటికీ జిల్లాలో 2014 వరకు అభివృద్ధి జరగలేదు. నల్లగొండ జిల్లా ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు’’ అని కాంగ్రెస్ నాయకత్వంపై లింగయ్య మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంటు, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలనే కాంగ్రెస్ నేతల ప్రయత్నాలను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. ఈ కారణంతోనే నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ ప్రగతి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రె్సను వీడి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు.