ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా హోం మంత్రిగా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాహుల్ గాంధీ మీటింగ్ విషయంలోనూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు కారెక్కనున్నారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి మూడు రోజుల క్రితం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిసినట్టు సమాచారం. సబితా టీఆర్ఎస్లో చేరేందుకు అసద్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ఈరోజు కేటీఆర్, సబితా, కవితలు అసదుద్దీన్ నివాసంలో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమైతే లోక్సభ ఎన్నికల ముందే సబితా, కార్తీక్ రెడ్డిలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనితో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది.