లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ కోవలో మరో ఇద్దరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరు తెరాస గూటికి చేరనున్నారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ను వీడి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏఐసీసీ అధినేత రాహుల్గాంధీ జరిగిన మరుసటి రోజే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్ కూడా కాంగ్రెస్కు ఝలక్ ఇచ్చారు. వీరి బాటలోనే సుధీర్రెడ్డి, పొదెం వీరయ్య కూడా నడవనున్నారని అటు కాంగ్రెస్, ఇటు తెరాస వర్గాల్లో చర్చ నడుస్తోంది.
జగ్గారెడ్డి చేరిక జరిగేనా..?
సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన జగ్గారెడ్డి కూడా పార్టీని వీడతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తెరాస అధినేత కేసీఆర్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఎంపీ ద్వారా పార్టీలో చేరికపై రాయబారం నెరిపినా కేసీఆర్ మాత్రం వద్దని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. చాలాఏళ్ల కిందట కేసును కేసీఆర్ స్వయంగా తవ్వి తీయించారని అప్పట్లో జగ్గారెడ్డి పెద్ద ఎత్తున కేసీఆర్పై ఆరోపణలు చేశారు. తర్వాత ఎన్నికల్లో తెరాస విజయం సాధించడంతో కేసీఆర్ను విమర్శించనని జగ్గారెడ్డి ప్రకటించారు. కేసీఆర్ను పొగుడుతూ హరీష్రావును విమర్శిస్తూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెరాసలో చేరేందుకు బాటలు పరుచుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ రేగింది. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరని సమాచారం.