హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహాకుంభాభిషేకానికి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 13న బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీన అంకురార్పణతో ప్రారంభించి ఐదు రోజుల పాటు ఋత్వికులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి రాత్రి వరకు బింబవాస్తు, నవకలశ స్నపనం, చతుర్దశ కలశ స్నపనం, హోమం, పూర్ణాహుతి, మహాశాంతి తిరుమంజనం, మహాశాంతి పూర్ణాహుతి, రక్షాబంధనం, కుంభారాధనం, నివేదనం, శయనాధివాసం, హౌత్రం, సర్వదేవతార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 13వ తేదీ బుధవారం ఉదయం 6 నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 7.30 నుండి 9 గంటలకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.