మాజీ మంత్రి పీ. సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించారు. బుధవారం ఆమె సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిసింది. ఆమెను పార్టీలో కొనసాగించేందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కకుండా పోయింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపులు కూడా ఫలించలేదు. ఈరోజు ఢిల్లీలో ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తో భేటీ ఏర్పాటు చేయిస్తామని చెప్పినప్పటికీ ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. జిల్లాలో తనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుపుతూ, తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుచరుల వద్ద ప్రస్తావించారు. ఇలాగే కొనసాగితే ప్రాధాన్యత లేకుండా పోతుందని, భవిష్యత్తులో తన కుమారుడి రాజకీయ భవితవ్యం గందరగోళంగా మారే ప్రమాదముందని ఆమె గ్రహించారు. గత ఎన్నికల్లో కొందరు నాయకులు తమ కుటుంబాలకు రెండు చొప్పున టిక్కెట్లు తెచ్చుకుని, తన కుమారుడికి ఇవ్వలేదని ఆమె సీనియర్ నాయకుల ముందు లేవనెత్తారు. పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరవు పెట్టినట్లు తెలిసింది.