తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కగా... ఇటు తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన కారు పార్టీ..అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మొత్తం 17 సీట్లలో మిత్రపక్షం ఎంఐఎంకు ఒక సీటు పోగా..మిగిలిన 16 సీట్లలో గెలిచేందుకు వ్యూహాలను సిద్ధంచేసింది. కొందరు సిట్టింగ్లను పక్కనబెట్టి... గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది.
2014 లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచి రాజకీయ అరంగేట్రం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతర కాలంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేతతో పాటు కేటీఆర్తోనూ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. జిల్లాలోనూ నిత్యం కలియ తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలలో పొసగక వైరి వర్గాలుగా తయారై రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనంత తీవ్రంగా గ్రూపులు నడిపారు. వైసీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచి తన వెంట తెచ్చుకున్న మదన్ లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు సహా తాను పట్టుబట్టి మధిర టికెట్ ఇప్పించుకున్న కమల్రాజు సైతం ఓటమి పాలయ్యారు. అటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లే తాము ఓటమి పాలయ్యామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, మదన్ లాల్, పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే తాము పని చేయమని ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు కేసీఆర్తో చెప్పినట్టు సమాచారం. వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సైతం ప్రత్యామ్నాయ అభ్యర్థిగా వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేరును సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పేరుంది. అంగ బలం, అర్థబలం, విస్తృతమైన సంబంధాలు, నెట్వర్క్ పరంగా తిరుగులేని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తన బలాలే బలహీనతలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. తామందరినీ గంప గుత్తగా ఓడించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఆగ్రహంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకటరావు, మదన్ లాల్, రవి, తాటి వెంకటేశ్వర్లు భారీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఏకంగా ఆయన టికెట్కే ఎసరు పెట్టారు. దీనికోసం సామాజిక వర్గ కోణంలో చక్రం తిప్పిన నేతలు సీఎం కేసీఆర్కు నమ్మకమైన ఇద్దరు ప్రముఖులతో ఒత్తిడి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కోసం రాష్ట్రంలో 16 సీట్లు గెలవాలని సీఎం కేసీఆర్ భావిస్తూ అభ్యర్ధులపై సర్వే చేయించారు. ఆ సర్వేలో సైతం ఖమ్మం లోక్సభ స్థానంలో 68 శాతం గెలిచే అవకాశం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ తీవ్ర వత్తిడికి తలొగ్గిన సీఎం కేసీఆర్ వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజ్యసభకు గానీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి వర్గం లోకి తీసుకుంటానని, తాను ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించే భాద్యత తీసుకోవాలని కోరినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పాత సాన్నిహిత్యాన్ని ఉపయోగించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించారు. తన పాత సన్నిహితున్ని ఆదుకోడానికి జగన్ ఈ టాస్క్ ను మాజీ ఎంపీ మిధున్ రెడ్డి కి అప్పగించారు. ఇప్పటికే మిధున్ రెడ్డి ఓసారి కేటీఆర్ను కలిసి వై. ఎస్. జగన్ మనోగతాన్ని వివరించారని సమాచారం. మరి వైసీపీ రాయబారం నేపథ్యంలో ఖమ్మం టికెట్పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.