హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ప్రజలు ఎవరైనా రూ. 50 వేల కంటే ఎక్కువగా తమతో తీసికెళ్తుంటే తప్పని సరిగా సదరు డబ్బుకు సంబంధించిన పత్రాలు వెంట తీసికెళ్లాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. తనిఖీలలో పోలీసులకు సరైన పత్రాలు చూపించకపోతే, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు.హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు మల్కాజిగిరికి సంబంధించిన ఒక అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉందని, మొత్తం 15 అసెంబ్లీ నయోజకవర్గాల పరిధిలో 45 స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను రంగంలోకి దింపామన్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 195 కేసులు నమోదయ్యాయని, లెక్కల్లో చూపని రూ. 29 కోట్ల నగదు, రూ. 3 కోట్ల విలువైన బంగారం, వెండి పట్టుబడిందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నమోదైన కేసులలో 120 కేసులలో ఛార్జీషీట్లు వేశామన్నారు. 17 కేసులలో తీర్పులు కూడా వెలువడ్డా యని సీపీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే తప్పని సరిగా రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. డబ్బు అక్రమ రవాణాలో ఎక్కువగా హవాల దందా జరుగుతున్నట్లు తెలుస్తుందని, ఈ విషయాలన్ని ఆదాయపన్ను శాఖ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వస్తాయన్నారు. పట్టుబడ్డ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఏ బ్యాం కు నుంచి నోట్లు బయటకు వచ్చాయి తదితర వివరాలు ఆదాయపన్ను శాఖ చూస్తుందన్నారు.