ముంబయి: ఉద్యోగాలు సాధించేందుకు భారతీయుల వద్ద డిగ్రీలు ఉంటున్నాయని కానీ కావాల్సిన నైపుణ్యాలు ఉండటం లేదని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఐబీఎం ఛైర్మన్, సీఈవో గిన్ని రొమెట్టి పేర్కొన్నారు. అయితే ఈ సమస్య కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందన్నారు. ‘గతంతో పోలిస్తే మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. కొన్ని కొత్త విషయాలు విశ్వసించాలి. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ కన్నా నైపుణ్యాలు చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించాలి. డిగ్రీల సాయంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు చేస్తున్న వారితో పోలిస్తే నైపుణ్యాలు ఉన్నటువంటి సెమీ స్కిల్డ్ ఉద్యోగులు ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు’ అని సంస్థకు సంబంధించి నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ మేరకు వివరించారు.
ఏటా ఇంజినీరింగ్, బిజినెస్ స్కూల్స్ నుంచి బయటికి వస్తున్న లక్షల మంది అభ్యర్థుల్లో నాలుగులో మూడోవంతు వారి దగ్గర కూడా సరైన నైపుణ్యాలు ఉండటంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు ఆమె తెలిపారు. కేవలం ఫిబ్రవరి 2019లోనే 3.12 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం చూస్తున్నట్లు సీఎంఐఈ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. రోజురోజుకీ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు సంయుక్తంగా నైపుణ్యాలు పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.