హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్మణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఇదే రకమైన మాటలు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు మాట్లాడారు. మీరు అనుకున్నట్లు ప్రజల ఆలోచన లేదు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ముందే చెప్పాం. ఆ విధంగానే బీజేపీ నాడు గెలిచిన శాసనసభ స్థానాల్లో మొన్న టీఆర్ఎస్ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలుకుంటే అన్ని ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది.
మీరు ఏమనుకున్నా.. ఏం చేసినా.. గ్రేటర్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్ల ఓడగొట్టామో.. రేపు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీని ఘోరంగా ఓడగొట్టి చూపిస్తామన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి సంవత్సరం తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పలేదు. దత్తాత్రేయకు సరైన గౌరవం ఇవ్వలేదు. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణ బిడ్డకు అవకాశం ఇవ్వకుండా అవమానించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఏం చేసిండు అని నరేంద్ర మోదీ ఓట్లు అడుగుతుండు. పన్నుల్లో రావాల్సిన వాటా తప్ప మనకు ఏమీ ఇవ్వలేదు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.