ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఆర్ఎస్ కి లగడపాటి బంపర్ ఆఫర్..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 07:09 PM

ఏపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ సీఎం , టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బంపర్ అఫరిచ్చారు. ఏపీ ఎన్నికల్లో విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి అన్ని రకాల సాయమందిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఆ పద్ధతి విడనాడి ప్రత్యక్ష పోరాటానికి దిగాలని హితవు పలికారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడే అవకాశమే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ హోరాహోరీగానే ఉండొచ్చని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై మూడు రోజులే అవుతున్నందున… అధికారంలోకి ఎవరిని తీసుకువస్తే రాష్ట్రం అభివద్ధి చెందుతుందోనన్న ఆలోచనకు రాష్ట్ర ప్రజలు త్వరలో వస్తారని వ్యాఖ్యానించారు.ఇలా వచ్చినప్పుడు ఫలితాలు తప్పనిసరిగా ఒక రాజకీయపక్షంవైపే మొగ్గు చూపుతాయన్నారు. తాను తెలంగాణలోని లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలలో ప్రజాభిప్రాయంపై సర్వే నిర్వహిస్తానని అన్నారు. ఎన్నికలు ముగిశాక ప్రజాభిప్రాయ నివేదికను వెల్లడిస్తానని చెప్పారు. గతంలో తెలంగాణలో తానిచ్చిన ప్రజాభిప్రాయ నివేదిక ఫలితం ఎందుకు తారుమారైందో కూడా వివరిస్తానన్నారు. ఇప్పుడు చెబితే ప్రజలు విశ్వసించకపోవచ్చని లగడపాటి వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను వైదొలిగినట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని, ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు.చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్టు ఇస్తామన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ప్రశ్నించగా… ‘రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా, ఫలానా వాళ్లు ఓడిపోవాలని కోరుకున్నా నేరుగా పోటీ చేయడమో.. ఎవరితోనైనా కలిసి పోటీ చేయడమో చేయాలి. టీఆర్ఎస్‌ ఇక్కడకొచ్చి పోటీ చేస్తే సంతోషిస్తా. దానివల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుంది.
ప్రజల మధ్య విభేదాలు తొలగిపోతాయి. అలా కాకుండా పరోక్షంగా ఎవరికో సహకరించడం సరికాదన్నది నా అభిప్రాయం. వారు మద్దతు ఇచ్చిన పార్టీ విజయం సాధిస్తే ఒకలా… లేదంటే మరోలా ఉంటుంది. ఇలాంటివేవీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయపక్షాలు తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ పోటీ చేయడం మంచిది’ అని లగడపాటి అన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com