సూర్యాపేట : ఏప్రిల్ 11న జరగబోయే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రేపు నల్లగొండలో జరిగే సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. మోదీని ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ దేశం ఆకర్షించే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్నారని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు. ఏ పార్టీకి కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ రాదని మంత్రి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో గెలవబోతుందన్నారు. ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.