లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా రాజకీయ పార్టీల హడావిడి చోటుచేసు కుంటోంది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట సమితి రాష్ట అనంతరం పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారిన సంగతి తెలిసిందే. ఈ రోజు కరీంనగర్ బహిరంగ సభ ద్వారా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు పార్టీ శ్రేణులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ఇప్పటికే రహదార్లన్నీ గులాబీమయమయ్యాయి. దేశంలో గుణాత్మక మార్పు రావాలని కోరుకుంటున్న గులాబి అధినేత కేసీఆర్ 16 లోక్ సభ సీట్లను గెలవడం ద్వారానే అది సాధ్యం అని ప్రగాఢంగా విశ్వసిస్తునట్టు ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. లోక్ సభ సీట్లను గెలవడం ద్వారా ఢిల్లీ శాషించగలమన్న అధినేత అంతర్యం ఇప్పటికే పలువురి నేతల ద్వారా బయటికి వస్తూనే ఉంది.
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేసీఆర్ తెరాస ఆవిర్భావ సభను కరీంనగర్లో నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలెప్పుడు జరిగినా ఆయన కరీంనగర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబరు 7న శాసనసభ ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టారు. ఎన్నికల తర్వాత తెరాస కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కేటీఆర్కు ముఖ్యమంత్రి అప్పగించారు. గత మూడు నెలలుగా కేటీఆర్ ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలతో పాటు నేతలతో ముఖాముఖి.. తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ తరఫున ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ను మంత్రివర్గంలో చేర్చుకోకుండా.. సీఎం ఆయనను పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. కీలకమైన పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని సీఎం మొత్తం 16 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు అవసరమని గుర్తించారు. ఈ సమావేశాల నిర్వహణ పూర్తిగా కేటీఆర్ ఆధ్యర్యంలో జరగనుంది. కేటీఆర్ అన్ని జిల్లాల మంత్రులు, నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో చర్చించి, షెడ్యూలు ఖరారు చేశారు. బుధవారం కరీంనగర్లో సన్నాహక సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సమావేశమైనా బహిరంగ సభను మరిపించే రీతిలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయల్దేరుతుండగా.. మంత్రులు, ముఖ్యనేతలు ఆయనను అనుసరిస్తున్నారు. పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుంచి ర్యాలీగా తరలుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గ సదస్సుకు దాని పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్, నగరపాలక సంస్థ మేయరు, పురపాలక సంఘాల ఛైర్మన్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొననున్నారు.