అయ్యగారి శ్రీమన్నారాయణ(విశాఖపట్నం) గారి ప్రశ్న: ఇటీవల కాలంలో విద్యార్ధులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నసందర్భాలు కనిపిస్తున్నాయి. వీటిపై జన చైతన్యం తీసుకురావాలసిన బాధ్యత మనపై ఉంది. భవిష్య తరాన్ని కాపాడుకోవాలి కదా?
నూకారపు సుర్యప్రకాష్ రావు గారి సమాధానం:
నిజమే శ్రీమన్నారాయణ గారు. ఈమధ్య పిల్లలు చదువులో కాస్త వెనుకబడి ఉన్నా, ఎవరన్నా వారిని మందలించినా, వారిని తోటి పిల్లలతో ఉన్నప్పుడు వారిని కోప్పడినా సరే వారిలో ఆత్మనూన్యత పెరిగి.. వారి ఆలోచన్లు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయనటంలో సందేహం లేదు. ఇలాంటి వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో మాట్లాడకుండా ఉంటే వారు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారేమో అని అనుమానపడాలి. వారిని ఆ ప్రయత్నాల వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీద ఉంది. పిల్లలు ఒకవేళ ఇలా ఉంటే వారి పట్ల అప్రమత్తత అవసరమే. నేనో పుస్తకంలో చదివా... ఈ తరహా ఆత్మనూన్యత ఉన్న వాళ్లు ఎప్పుడు దిగులుగా, ముభావంగా వుంటారు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా వుండేందుకు ప్రయత్నిస్తూ ఒంటరిగా వుండేందుకు ఇష్టపడుతుంటారు. నిద్ర, ఆహారం, వ్యవహారాలతో పాటు దేనిపైనా అంత ఆసక్తిని చూపివ్వరు. ఆతృత, వ్యాకులత వారిలో కొట్టచ్చినట్టు కనిపిస్తుంటుంది. ఏ విషయంలో నైనా అతిగా ఉద్వేగాలను ప్రదర్శిస్తూ, ఏ ఇద్దరు మాట్లడుకుంటున్నట్టు కనిపించినా తమ గురించే అన్న భావన వ్యక్తం చేస్తుంటారు అప్పుడప్పుడు చావులు, ఆత్మహత్యలు గూర్చి మాట్లాడుతుంటారు ఎవరైనా వారిని కాస్త కోప్పడినా సరే నేను చస్తే పీడ వదులుతుంది లాంటి మాటలు నిషూరంగా మాట్లాడుతుంటారు. కొంత మంది డైరీలు, పుస్తకాల్లో వారు ఎంత బాధపడుతున్నారో వారిని ఎవరెవరు బాధలకు గురిచేస్తున్నారో కూడా రాసుకుంటూ ఉంటారు. ఆ డైరీలను కూడా చూస్తుండాలి. పైగా ఆత్మహత్యలు ఎట్లా చేసుకోవచ్చో అని కూడా ఆరాలు తీస్తుంటారు. పైగా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ఏవిధంగా చేసుకొన్నారో అని అడుగుతుంటారు. అందుకే వీరిని ఓకంట కనిపెట్టుకుని ఉం డాలి. వారు ఒకవేళ తప్పు చేసినా మెల్లగా నొచ్చుకోకుండా చెప్పాలి కాని గట్టిగా వారి మనసు బాధ పడేట్టుగా చేయకూడదు. ఇలా ఉన్నట్టు మీకేదైనా అనుమానం వస్తే వారిని దగ్గరకు పిలిచి వారిలో ఆత్మవిశ్వాసం కలిగేలా మంచి మాటలు చెప్పాలి. అప్పుడే వారిలో సమస్యలు ఎదుర్కోగలమన్నసృహ కలుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.