వనపర్తి: తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలోని కడుకుంట్ల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారనీ, ప్రజలకు మంచి చేసే ఏ పనినైనా సీఎం చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. పండుగ రోజు రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచూ కొత్త బట్టలతో కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. చీరల పంపిణీతో పాటు మహిళలకు మంత్రి ఓ మొక్కను కూడా బహూకరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మొహంతి, జెడ్పీ ఛెర్మన్ లోక్నాథ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.