తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించనున్నారు. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 -23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ. 40వేలకోట్లకుపైగా తక్కువ నమోదైందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలిపేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.