కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా సుందరీకరణ, జంక్షన్ విస్తరణ పనులను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటి అభివృద్ధికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 10 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని అందులో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో రెండు కోట్ల రూపాయల నిధులను జంక్షన్ల సుందరీకరణ , విస్తరణ కోసం కేటాయించడం జరిగిందన్నారు. నేడు బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తాను, జంక్షన్ సుందరీకరణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత నాయకులు నిర్లక్ష్యం వల్లనే ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి కొల్లాపూర్ ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.