డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఆందోళన చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాను ఐదు సంవత్సరాల క్రితం కలెక్టర్గా పని చేసిన సమయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలంటూ ఆయన లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. 960 ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు మురళిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. స్టేషన్లోనూ ఆకునూరి మురళీ ఆందోలళ కొనసాగించారు. మురళికి మద్దతుగా డబుల్ బెడ్ రూం లబ్ధిదారులు, మహిళలు స్టేషన్కు తరలివచ్చారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించే వరకు తాను ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఆకునూరు భీష్మించుకుని కూర్చోవటంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని గత కొంత కాలంగా ఆకునూరి మురళి తన నిరసన గళం వినిపిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిరుపేదలకు ఇవ్వాలని పోరాటం మొదలు పెట్టారు. ఇదే విషయమై పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కలెక్టర్కు వినతిపత్రం కూడా ఇచ్చారు. ఇళ్లు నిర్మించి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. పేదలకు కేటాయించటం లేదని ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో భూపలపల్లిలో ఇవాళ ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.