ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...ఈటల రాజేందర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకొంటున్నారని బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు.  అదే సందర్బంలో సీఎం కేసీఆర్ దుర్మార్గంగా పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఆర్మూర్‌లో జరుగుతున్న నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా అనే విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్‌లో లేదంటే ఫామ్‌హౌస్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. రాచరికంలో రాజులు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారోనని మారు వేషంలో వెళ్ళి తెలుసుకునేవారని.., కానీ కేసీఆర్ మాత్రం ఆ ప్రయత్నం చెయ్యటం లేదని దుయ్యబట్టారు.


"ధరణీ వల్ల రైతులు వేదన అనుభవిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో తరతరాలుగా ఉన్న అసైన్డ్ భూమి పోయిందని 19 ఏళ్ళ యువకుడు చనిపోయాడు. ప్రగతి భవన్ ముందు తన భూమిని గుంజుకున్నారని ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేష్ అనే వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకొనే నాథుడు ఎవడు లేడు అనడానికి ఇవి ఉదాహరణలు. కేసిఆర్ నీచమైన సాంప్రదాయాలు తెచ్చారు. ఓటుకు వెలగట్టాడు. ఇదే పద్ధతిని దేశమంతా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టారా ? కేసీఆర్ గొప్పగా అయ్యే పని చేయడు. ప్రతిపక్ష పార్టీలలో అల్లకల్లోలం సృష్టించి.. ఆయనే దిక్కు అనేలా చేస్తారు. కేంద్రం అందించే ఎరువుల సబ్సిడీ ఎకరానికి రూ.10 వేలు. పత్తికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తుంది. ఎకరానికి రూ.6 వేలు కేంద్రం ఇస్తుంది. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్‌హౌస్‌లకి డబ్బులు ఇస్తున్నారు. పేదల డబ్బులు భూస్వాములకు అప్పజెప్పుతున్నారు.


మూడున్నర లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే.. తిరిగి రాష్ట్రానికి లక్షన్నర కోట్ల రూపాయలు ఇస్తుంది అని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ చదువుకున్నారా ? లేదా ? తెలంగాణ భారత దేశంలో ఉందా ? లేదా ? అనే అనుమానం వస్తుంది. జీహెచ్‌ఎంసీకి 70 శాతం ఆదాయం వస్తుంది. ఆదిలాబాద్‌లో ఆదాయం రాదు అని అక్కడ ఖర్చుపెట్టరా ? ఆ సంస్కారం లేదా ? హైదరాబాద్ డబ్బు లేకుండా రాష్త్రం నడుస్తుందా ? జ్ఞానం ఉండాలి. మోదీ ఎప్పుడు నేను ఇస్తున్న అని అనలేదు. కేసిఆర్ మాత్రం నేను పెన్షన్ ఇస్తున్నా, నేను కల్యాణలక్ష్మి ఇస్తున్నా అని చెప్పుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రం రెండింటికీ డబ్బులు ఇచ్చేది ప్రజలు. లిక్కర్ పైసలు, ఇన్‌ కం ట్యాక్స్ పైసలు రాష్ట్రానికి మాత్రమే వస్తాయి. తెలంగాణ వచ్చినప్పుడు తాగుడు మీద వచ్చే ఆదాయం 10 వేల కోట్లు అయితే ఇప్పుడు రూ.45 వేల కోట్లు అయ్యింది. ఇది.. ప్రజా ప్రభుత్వమా ? ప్రజా కంటక ప్రభుత్వమా ? ప్రజలే తేల్చాలి.


కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచారు. కెసీఆర్ బయటపడకుండా.. దొంగతనంగా ఛార్జీలు వేస్తారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ కరెంటు బిల్లులు. మనం ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల మీద పోరాడుదాం.. వారి ఆశీర్వాదం మనకు ఉంటుంది. కేసీఆర్ ఒడిపోవాలని.. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు దెబ్బకొడితే కేసీఆర్ దిమ్మతిరిగింది. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది." అని ఈటల రాజేందర్ అన్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com