అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం సాయంత్రం మైలార్ దేవ్ పల్లి లోని తన కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాటేదాన్ లో జరుగుతున్న స్టేడియం పనులు, కాటేదాన్ మెయిన్ రోడ్డు, శాంతి నగర్ లోని సీసీ రోడ్డు, డ్రైన్స్ పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలన్నారు. పనుల నిర్వహనకు నిధుల కొరత లేదన్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృ ష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ నరేందర్ గౌడ్, ఏఈ బల్వంత్ రెడ్డి , జలమండలి డీజీఎం జమిల్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, రఘుయాదవ్, సరికొండ వెంకటేష్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.