రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని ఆందోల్ ఎమ్మెల్యే చంటిక్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్లో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అల్లాదుర్గంలోని పీఏసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అంధత్వ నివారణ కోసం ఏర్పాటు చేసిన కంటివెలుగులో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.