కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్, మాజీ రిజిస్ట్రార్ బి. వెంకట్రామరెడ్డితో సహా ఫైనాన్స్ ఆఫీసర్ టి. రాజయ్యల పై కేయూ పోలీస్టేషన్ లో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్టేషన్లో జిల్లాకోర్టు ఆదేశాల మేరకు వారిపైన 418, 425, 405, 406, 408, 409 సెక్షన్లకింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజకుమార్ సోమవారం తెలిపారు. యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలలో అవకతవకలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చిన విషయం విధితమే. వారితో కుమ్మక్కై వారిని ఉద్యోగంలో కొనసాగిస్తూ నిబంధనలకు విరు ద్దంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలను కూడా చెల్లిస్తున్నారని తమప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని డాక్టర్ వినీత నాయిని జిల్లాకోర్టులో గత ఏడాది సెప్టెంబర్ లో కేసు వేశారు. దీంతో జిల్లా కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు కేయూ పోలీస్టేషన్లో ఈనెల 28న పోలీసులు వీసీ, మాజీ రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్లపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.