విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని జెన్కో-ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఉద్యోగులు వినియోగదారుల సేవలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో రాష్ట్ర విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం డైరీని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కరెంట్ లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఎక్కడా లేవన్నారు. కొవిడ్తో రెండేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు రూ. 1300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వీటి నష్టాలకు కేంద్రం విధానాలు కూడా ఒక కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రమేష్, నేతలు వినోద్కుమార్, విజయ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.