నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని వెల్టూరు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సామాజికవేత్త అయినేని సంతోష్ కుమార్ అధ్వర్యంలో ఉదయం పూట అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆర్. రంగారెడ్డి , పి. అర్జున్ రావు, ప్రధానోపాధ్యాయులు రవిశంకర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా సామాజికవేత్త, కార్యక్రమం నిర్వాహకులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ నిత్యం పాఠశాలకు రావాలని , ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా విని రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులు ఉదయం పూట ప్రత్యేక తరగతులకు రావడంతో వారు ఉదయం అల్పాహారం తినడం లేదని, విద్యార్ధుల ఆరోగ్యం పరిరక్షించేందుకు, విద్యార్థులు చదువుపై దృష్టి నిలిపేందుకు ఈ కార్యక్రమాన్ని చెప్పట్టడం జరిగిందని అన్నారు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు అల్పాహారం వండి పెడుతున్న వసంతకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో విద్యార్థుల నుంచి వచ్చే ప్రతిస్పందనను బట్టి మరింత ముందుకు వెళ్ళడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జి. లింగయ్య, సిహెచ్. లింగయ్య, పి. జంగారావు, వసంత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.